జగన్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు : నారా లోకేష్‌

మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:57 IST)
ఓపక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ముందే సంక్రాంతి వచ్చిందంటూ ముఖ్యమంత్రి జగన్‌ అనడం సిగ్గుచేటని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం మేడపి గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు.

50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రూ.10 వేల కోట్లు నష్టం వస్తే రూ.646కోట్లు విదిల్చి పండగ వచ్చిందని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టపరిహారం అంచనా కూడా అవసరం లేదన్న జగన్‌రెడ్డి ఇప్పుడు ఎకరానికి రూ.5వేలు పరిహారం ఇచ్చి రైతుల్ని అవమానపరుస్తున్నారు.

ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇన్సూరెన్స్‌ కట్టామని అసెంబ్లీలో అబద్ధాలాడారని విమర్శించారు. చంద్రబాబు అసెంబ్లీలో బైటాయించిన తరువాత ఇన్స్యూరెన్స్‌ కట్టారని తెలిపారు. తడిసిన దెబ్బతిన్న, రంగుమారిన పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోళ్లు చేయాలన్నారు.

పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.50వేలు, దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు, చేతివఅత్తుల వారికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. అనంతరం దొంగ ప్రకటనలు, అసత్య వార్తలు ఇస్తారా అంటూ రైతులతో కలిసి సాక్షి పేపర్‌ను దహనం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు