ఏపీకి పెట్టుబడుల కోసం.. వచ్చే నెల 3న అమెరికాకు నారా లోకేష్!

సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:39 IST)
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో కొత్త రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం హోదాలో నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలకు వెళ్తున్న తరుణంలో.. ఆయన తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన వచ్చే నెల 3న అమెరికా వెళుతున్నారు.
 
ఏకంగా పది రోజుల పాటు అక్కడే ఉండే ఆయన అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారట. ఆయా రాష్ట్రాల గవర్నర్లు, పారిశ్రామికవేత్తలతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ భేటీ అయ్యేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారని సమాచారం. 
 
గతంలో అమెరికాలో విద్యాభ్యాసం, కొంతకాలం పాటు అక్కడే ఉద్యోగం చేసిన అనుభవం నేపథ్యంలో అక్కడ నారా లోకేష్‌కు పెద్ద సర్కిలే ఉంది. తాజాగా తానా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సతీశ్ వేమనతోనూ లోకేశ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో లోకేశ్, మంచి ఫలితాలను రాబట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి