ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు : 26న అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్

వరుణ్

గురువారం, 25 జులై 2024 (18:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు అక్షరాలా పది లక్షల కోట్లు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ అప్పులపై శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా అధ్యయనం చేసిన కూటమి ప్రభుత్వం 2019-24 మధ్య పెండింగ్‌ బిల్లులు రూ.1,41,588 కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులు రూ.వేల కోట్లు ఉన్నట్టు తేల్చింది.
 
పెండింగ్‌ బిల్లుల్లో రూ.93 వేల కోట్లు సీఎఫ్ఎంఎస్‌లోకి అప్‌లోడ్‌ చేయలేదని, రూ.48 వేల కోట్లు మేర బిల్లులు అప్‌లోడ్‌ చేసినా చెల్లింపులు చేయలేదని నిర్ధరించింది. భారీగా నీటిపారుదలశాఖ, పోలవరం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ ప్రాజెక్టులకు చెందిన రూ.19,324 కోట్ల మేర బకాయిలు గుర్తించారు. 
 
ఆర్థిక శాఖ నుంచి రూ.19,549 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.14 వేల కోట్లు, మున్సిపల్‌ శాఖలో రూ.7,700 కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ వివరాలను శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వం వెల్లడించనుంది.
 
రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు అంశాలపై ఆయన శ్వేతపత్రాలు విడుదల చేశారు. పోలవరం, అమరావతి, విద్యుత్ రంగం, ఇసుక దోపిడీ వంటి అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు వాటి వివరాలను ప్రజల ముందుంచారు. ఈ క్రమంలోనే వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి గత ప్రభుత్వంలో భద్రతా వైఫల్యాలను ఎండగట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు