ఏపీలో మద్యం స్కాం : పరారీలో వాసుదేవ రెడ్డి... లుకౌట్ నోటీసు జారీ

వరుణ్

గురువారం, 25 జులై 2024 (14:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ళ వైకాపా ప్రభుత్వంలో భారీ స్థాయిలో మద్యం స్కామ్ జరిగినట్టు తేలింది. ఈ స్కామ్‌లో చిక్కకుండా ఉండేందుకు వీలుగా విజయవాడలోని ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ బీసీఎల్) ప్రధాన కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలు చోరీ చేశారన్న ఫిర్యాదుతో ఈ నెల 6వ తేదీన ఆయనపై కేసు నమోదైంది. ఆ తర్వాతి రోజే హైదరాబాద్ నగరం నుంచి ఏపీఎస్ బీసీఎల్ ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి అయిన వాసుదేవ రెడ్డి ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. అయితే, ఆయన అప్పటికే పరారైనట్టు గుర్తించారు. 
 
గత నెలన్నర రోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. పైగా ఆయనపై ఇప్పటికే అనేక అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పైగా, ఇప్పటివరకు ఆయన ఆచూకీ లభించలేదు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అదేసమయంలో ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు జారీ కూడా అయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న ఆయన మరోవైపు, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తన న్యాయవాదులతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. 
 
రెండో పెళ్లి చేసుకున్న మహిళ.. చెట్టుకు కట్టేసి దాడి చేసిన మహిళలు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఓ అమానుష ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ తన భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లి చేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆ గ్రామ మహిళలు పెళ్లి చేసుకున్న మహిళను చెట్టుకు కట్టేసి కోడిగుడ్లతో దాడి చేసి, కర్రలతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ.. రెండో వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ మహిళలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆపై తప్పు చేసిందంటూ విచక్షణా రహితంగా ప్రవర్తించారు. కర్రలతో ఆమెను కొడుతూ, కోడిగుడ్లతో దాడి చేస్తూ ఆమెను నానా హింసకు గురిచేశారు. 
 
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ గ్రామానికి చేరుకుని బాధితురాలిని రక్షించి ఠాణాకు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, మహిళల దాడిలో గాయపడిన బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు