నెల్లూరు జిల్లాలో నల్ల కుబేరులకు ఓ నేత బంపర్ ఆఫర్ ప్రకటించారు. వడ్డీలేకుండా పాతనోట్లు ఎంతైనా అప్పుగానైనా తీసుకుంటానని చెప్పారు. తీసుకున్న సొమ్ము రెండేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తానంటూ ప్రకటించారు. దీంతో ఆ నాయకుడి ఇంటిముందు జనాలు, బడాబాబులు బారులు తీరారు. ఒక్క నెల్లూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, కోస్తా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కూడా నోట్లకట్టలతో ఆ నేత ఇంటి ముందు క్యూలో నిల్చున్నారట. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా సేకరించినట్లుగా సమాచారం.
మరోవైపు బ్యాంకర్ల భాషలో అవన్నీ నాన్ ఆపరేటెడ్ కరెంట్ అకౌంట్స్ ద్వారా బ్లాక్ మనీని వైట్గా మార్చుకుంటున్నారు. నాన్ ఆపరేటెడ్ కరెంట్ అకౌంట్స్ అంటే నగదు లావాదేవీల్లేని ఖాతాలు. ఖాయిలాపడిన పరిశ్రమలు, వ్యాపార సంస్థల పేరుతో బ్యాంకుల రికార్డుల్లో ఏళ్ల తరబడి ఎంట్రీలకు నోచుకోని అకౌంట్స్. ఇప్పుడవే నల్లధనాన్ని తెలుపుగా మార్చే వనరులుగా మారిపోయాయి.