ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించా.. సర్కారు సహకరిస్తుందని భావిస్తున్నా : నిమ్మగడ్డ

సోమవారం, 3 ఆగస్టు 2020 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా తిరిగి బాధ్యతలు స్వీకరించినట్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అలాగే, ఏపీ సర్కారు కూడా తనకు సహకరిస్తుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారు. దీంతో ఆగ్రహించిన ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీ పదవీకాలాన్ని ‘సంస్కరణల’ పేరిట కుదిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. తక్షణమే నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిందని ఆయనను తొలగించింది. 
 
అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించింది. దీంతో నిమ్మగడ్డ న్యాయపోరాటానికి దిగారు. ఆయన విషయంలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 
 
కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీగా తిరిగి రమేష్ కుమార్‌ను నియమిస్తూ గత గురువారం అర్థారత్రి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో నిమ్మగడ్డ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని గుర్తుచేశారు. 
 
రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పని చేస్తుందన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తొడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించినట్టు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్లకు తెలియజేశామని రమేష్ కుమార్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు