గాంధీ ఆస్పత్రి వద్ద ఆంక్షలు... నిజామాబాద్ వాసికి కరోనా? వివరాల వెల్లడికి నో!

బుధవారం, 4 మార్చి 2020 (12:10 IST)
కరోనా వైరస్ సోకిన వ్యక్తిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల చికిత్స అందిస్తున్నారు. అలాగే, మంగళవారం రాత్రి మరో కరోనా వైరస్ సోకినట్టుగా భావిస్తున్న మరో వ్యక్తిని ఇక్కడే చేర్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రెడ్డిపల్లికి చెందిన ఈ వ్యక్తి కరోనా లక్షణాలతో కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆయన గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. అర్థరాత్రి 1.55 నిమిషాలకు అతడిని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. దీంతో హైదరాబాద్ నగర వాసులు వణికిపోతున్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 457 అనుమానిత కేసులు నమోదైనట్టు సమాచారం. ఒక్క మంగళవారమే ఏకంగా 42 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నమోదు కావడం గమనార్హం. ఎయిర్ పోర్టులో ఇప్పటివరకు 18,224 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్స్ నిర్వహించగా, 42 మందిని అనుమానితులుగా గుర్తించారు. 
 
మరోవైపు, హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో, ఆసుపత్రి ప్రాంగణంలో పలు ఆంక్షలను విధించారు. కేసుల వివరాలను బయటకు వెల్లడించవద్దని వైద్యులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ మాత్రమే కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారం వెల్లడించాలని ఆదేశించారు. 
 
అదేసమయంలో ఆసుపత్రి వద్ద మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. ఇకపై ఆసుపత్రి ఆవరణలోకి మీడియాకు అనుమతి లేదు. మీడియా వాహనాలను ఇక్కడి నుంచి తరలించాలని, మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు