రైతు భరోసా కాదు.. రైతు మోసం: టీడీపీ విమర్శ

మంగళవారం, 15 అక్టోబరు 2019 (06:10 IST)
వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా కాదు.. వైఎస్ఆర్ రైతు మోసం అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారంలో ఒకటి చెప్పి.. ఇప్పుడు మరొకటి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. సోమవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామానాయుడు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు 15 లక్షల పైబడి ఉండగా.. రైతు భరోసా పథకానికి 40వేల మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయడం మోసం కాదా? అని ప్రశ్నించారు.

కేంద్రం ఇస్తున్న ఆరువేలతో కలిపి ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆ విధంగా చెప్పినట్లు ప్రభుత్వం నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రామానాయుడు సవాల్ విసిరారు. కేంద్రం ఇస్తున్న రాయితీతో కలిపి రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.18,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు 194 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రైతు రుణమాఫీని యధావిదిగా కొనసాగించాలని ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు