చంద్రప్రభ వాహనంపై పద్మావతి అమ్మవారు

మంగళవారం, 17 నవంబరు 2020 (20:50 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి  అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు.

అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు,  జెఈవో  పి.బ‌పంత్‌కుమార్ దంప‌తులు, సివిఎస్వో  గోపీనాథ్ జెట్టి, ఎఫ్ ఏ అండ్ సిఏవో బాలాజి , సిఇ ర‌మేష్‌రెడ్డి, విఎస్వో బాలిరెడ్డి‌, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్ర‌మ‌ణ్యం, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, కంకణభట్టార్ వేంపల్లి శ్రీనివాసులు, అలంకార భట్టార్ ఎం.జి.రామచంద్రన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
న‌వంబ‌రు 19న పంచమీ తీర్థం :
నవంబరు 19వ తేదీ గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం) సందర్భంగా ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉద‌యం 10 నుండి మధాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా నిర్వహించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు