ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య... పవన్ కల్యాణ్‌ ఏమన్నారంటే...

బుధవారం, 19 జులై 2017 (08:52 IST)
వచ్చే నెల ఐదో తేదీన దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా తెలుగుబిడ్డ ఎం వెంకయ్య నాయుడు పోటీ చేస్తున్నారు. అతిరథమహారథులు వెంటరాగా ఆయన మంగళవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయనతో యూపీఏ కూటమి అభ్యర్థిగా జాతిపిత మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పోటీపడుతున్నారు. ఎవరు పోటీలో ఉన్నప్పటికీ వెంకయ్య నాయుడు విజయం మాత్రం నల్లేరుపై నడకలా మారింది. 
 
ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్య నాయుడికి సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలుగు బిడ్డ, సీనియర్‌ రాజకీయ నాయకుడిగా అపార అనుభవం కలిగిన వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవికి వన్నెతెస్తారని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది తెలుగువారందరూ గర్వించదగ్గ పరిణామమని, తెలుగువారికి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేసినందుకు బీజేపీ అధినాయకత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి