పవన్ కల్యాణ్‌తో వైకాపా నేరుగా తేల్చుకోనుందా? రోజా నోట జగన్ మాటే వచ్చిందా?

మంగళవారం, 28 మార్చి 2017 (07:47 IST)
ఏపీలో రాజకీయ పార్టీల దోబూచులాటలో ఇప్పుడు కాస్త స్పష్టత వచ్చినట్లే. పవన్ కల్యాణ్‌పై వైకాపా తొలి అధికారిక ప్రకటనలాంటిది రోజా నోటి వెంట వచ్చాక వైకాపా వైఖరి ఎలా ఉంటుందనేది తేలిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ పవన్ జనసేన పోటీయే కాదని వైకాపా ఎమ్మెల్యే రోజా తేల్చి చెప్పారు. తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ఎన్ని రాజకీయ సంక్షోభాలు మీదపడినా, జైలు కెళ్లినా వైఎస్ఆర్ ఆదర్శాలను వదులుకోకుండా కాంగ్రెస్ అధిష్టానంతోనే తలపడి తానేంటో రుజువు చేసుకున్నాడని అదే ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశంపై ధ్వజమెత్తిన పవన్ తర్వాత అదే టీడీపీ-బీజేపీ కూటమికి ఓట్లేయమని ప్రచారం చేసారని రోజా ఎద్దేవా చేసి మరీ ఇద్దరిమద్యో పోలికలను తెచ్చారు.
 
పైగా గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి తరపున ఓట్లడిగిన పవన్ ఈ రెండు పార్టీలు తమ వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే వారితో యుద్ధం చేస్తానంటూ ప్రకటించారని, ఇంతవరకూ ఆయన ఏం చేశారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేక ఓటును పవన్ జనసేన పార్టీ చీల్చివేసి 2019 ఎన్నికల్లో టీడీపీకి మేలు చేకూర్చనున్నారంటూ వస్తున్న వార్తలపై వ్యాఖ్యానించడానికి రోజా తిరస్కరించడం విశేషం. 
 
అదే సమయంలో అసెంబ్లీలో తన బహిష్కరణకు దారితీసిన పరిణామాలపై వ్యాఖ్యానించిన రోజా తానే తప్పు చేయలేదని తేల్చి చెప్పారు. దీన్ని అలా ఉంచితే పవన్‌ కల్యాణ్ జనసేనకు తాను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని జగన్ నేరుగా కాకుండా రోజానోట చెప్పించారని అందరూ భావిస్తున్నారు. పవన్ కొంత మేరకైనా తమతో కలిసి వస్తాడనుకున్న ఆశలు చెదిరిపోవడంతో ఇక పవన్‌తో రాజీపడేది లేదని వైకాపా సంకేతాలు పంపినట్లు స్పష్టమవుతోంది.
 

వెబ్దునియా పై చదవండి