తిరుపతి వేదికగా పవన్ మద్యంపై సమరం...

సోమవారం, 31 జులై 2017 (21:15 IST)
ఉద్దానం ప్రజల సమస్యలపై తనదైన రీతిలో స్పందించిన జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మద్యంపై పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చారట. ఎపిలో ఎక్కువగా మద్యంపై సమరం చేసిన ప్రాంతాల్లో తిరుపతి ప్రధానమైనది. అందుకే తిరుపతిని వేదికగా చేసుకుని మద్యంపై సమరం చేయాలని పవన్ నిర్ణయానికి వచ్చారట. మహిళా సంఘాలందరినీ కలుపుకుని శాంతియుతంగా ప్లకార్డులను చేతపట్టుకుని మద్యంపై పోరాటం చేయాలని పవన్ నిర్ణయం తీసేసుసుకున్నారట. 
 
ఇప్పటికే ఇదే విషయమై తిరుపతికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులతో పవన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. తాను ఎందులోను నిపుణుడిని కాదని, తోటి మనిషి కష్టంలో భాగం పంచుకోవాలని చూసే వ్యక్తిని మాత్రమేనని భారీ డైలాగులతో ఇప్పటికే పవన్ విశాఖపట్నంలో ప్రసంగించారు. 
 
తిరుపతి లాంటి ఆధ్మాత్మిక క్షేత్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని ముందు నుంచి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ ప్రత్యేకంగా ఈ ప్రాంతంవైపు దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. జనావాసాలు, ఆలయాలు, పాఠశాలల మధ్య వైన్ షాపులను పూర్తిగా ఎత్తివేసేలా ప్రభుత్వం  స్పందించాలన్న డిమాండ్ తోనే శాంతియుతంగా పవన్ పోరాటం చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి