ఆయన 'ఆల్‌ ది బెస్ట్' చెప్పారట.. అయితే, జనసేనలోకి వస్తారా?

మంగళవారం, 27 మార్చి 2018 (09:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల అమలులో మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శల వర్షం కురిపించారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిల వైఖరిని ఆయన తూర్పారబట్టారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం చేపట్టాల్సిన ఆందోళనల కార్యాచరణపై సీపీఐ, సీపీఎం ప్రతినిధులతో సోమవారం హైదరాబాద్‌లో పవన్‌ సమావేశమయ్యారు. 3 గంటలపాటు చర్చించారు. అనంతరం సీపీఐ, సీపీఎం ఏపీ కార్యదర్శులు రామకృష్ణ, మధు, తదితరులతో కలిసి పవన్‌ విలేకరులతో మాట్లాడారు. హోదా విషయంలో ప్రజల్ని బీజేపీ, టీడీపీ మోసం చేశాయన్నారు. వామపక్షాలతో కలసి ప్రజల పక్షాన పోరాడతామన్నారు. 
 
అంతేకాకుండా, ఇటీవల ప్రభుత్వ కొలువుకు రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని పవన్ చెప్పారు. లక్ష్మీనారాయణకు రాజకీయ, పరిపాలన విధానాలపై మంచి పట్టు ఉందన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే తాను జేడీని కలిశానని, పార్టీలో చేరే విషయమై ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన జనసేన ఆవిర్భావ వార్షికోత్సవ సభ సందర్భంగా లక్ష్మీనారాయణ తనకి 'ఆల్‌ ది బెస్ట్' అని మెసేజ్‌ పంపించారని గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు