ఇందులో భాగంగా కేసీఆర్పై పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టినందుకే కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారని పెద్దిరెడ్డి అన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే అని... అయినా ఎన్టీఆర్ పేరుపై వీరిద్దరూ దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ఎన్టీఆర్ను అసహ్యించుకుంటున్న కేసీఆర్... ముందు తన కుమారుడి పేరు మార్చి, ఆ తర్వాత మాట్లాడాలని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవమని, దేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే, తెలుగువారికి ఎన్టీఆర్ హయాంలోనే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు.