మాస్టర్ ప్లాన్ లకు అనుగుణంగానే పనులు చేపట్టండి: మంత్రి బొత్స

మంగళవారం, 28 జనవరి 2020 (07:27 IST)
పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో  ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా రాష్ట్రంలోని పట్టాణాభివృద్ధి సంస్థలను (అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు) దీని కోసం ఒక సమగ్రమైన కార్యాచరణను పథకంతో పనిచేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఈ సంస్థల పనితీరు సమర్థవంతంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై,  నివేదిక రూపొందించాలని ఆయన పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సిఆర్ డిఎ కార్యాలయంలో రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్ధల వైస్ ఛైర్మన్లు, కార్యదర్శులు, ఆయా సంస్థల టౌన్ ప్లానింగ్ సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, కమిషనర్ విజయకుమార్, డిటిసిపి రాముడు, సిఆర్ డిఎ కమిషనర్ లక్ష్మీ నరసింహం తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ యుడిఎలకు వస్తున్న ఆదాయాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు.

యుడిఎ లకు వస్తున్న అంతర్గత ఆదాయం, కేంద్ర రాష్ట్ర నిధుల కేటాయిపు వాటి వినియోగం, వాటిపరిథిలోని మున్సిపాలిటిలు, కార్పొరేషన్లతో(యుఎల్ బిలతో) సమన్వయం, లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.

ఆయా ప్రాంతాల్లోని మాస్టర్ ప్లాన్లకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమగ్రమైన కార్యాచరణను రూపొందించాలని సూచిస్తూ,  ఎక్కడెక్కడ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి, రోడ్లు, గ్రీనరీ 
సంబంధిత పనులు, తదితర అంశాలపై కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు.

ముఖ్యంగా ఆయా పట్టణాభివృద్ధి సంస్థలు తమకు నిర్దేశించిన లక్షాలకు అనుగుణమైన స్థితిలో అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాయో లేదో అధ్యయనం చేసి, తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక ప్రణాళికా బద్దంగా జరిగేలా అనుసరించాల్సిన కార్యాచరణపై ఉన్నతాధికారులు అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఆ నివేదికను అనుసరించి పట్టణాభివృద్ధి సంస్థల పనితీరును మెరుగుపరిచేలా సమగ్రమైన చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలోనే మరో సమావేశాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు