తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని బాలికను కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించి 13 ఏళ్ల బాలికను సురక్షితంగా రక్షించారు. ఇంకా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తికి చెందిన శ్రీనివాస్ కరోనా సమయంలో జీవనోపాధి కోసం తన కుటుంబంతో తిరుపతికి వెళ్ళాడు. అక్కడ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకున్నాడు.
ఇటీవల శ్రీనివాస్ కుటుంబం తిరిగి స్వగ్రామానికి వచ్చింది. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో, ఈశ్వర్ రెడ్డి నిన్న చీమకుర్తికి వచ్చి, శ్రీనివాస్ కుమార్తె చదువుతున్న పాఠశాల వద్దకు వెళ్ళి.. బాలికను కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలిక చేతే ఆమె తండ్రికి ఫోన్ చేయించి, "రూ.5 లక్షలు తిరిగి ఇస్తేనే అమ్మాయిని వదులుతా, లేకపోతే చంపేస్తా" అని బెదిరించాడు.
ఈ ఘటనపై తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేగవంతంగా దర్యాప్తు జరిపించి కేసును చేధించారు. చివరికి కావలి సమీపంలో ఈశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని, బాలికను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు.