ఏపీలో వర్షాలు

శనివారం, 22 మే 2021 (11:19 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. కోస్తాంధ్రలో భారీ ఈదురుగాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. పిడుగుపాటుకు ఒకరు మరణించారు. రెండు పశువులు మృత్యువాత పడ్డాయి.
 
శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇచ్ఛాపురం మండలం బెర్లంగికి చెందిన తిప్పన ప్రశాంత్‌ కుమార్‌ (27) పిడుగుపాటుకు గురై మరణించాడు. విశాఖ జిల్లా పాడేరు, అరకు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

అరకులోయ మండలం మాడగడ పంచాయతీ బోసుబెడ గ్రామ సమీపంలో పిడుగుపడటంతో రెండు పశువులు మృత్యువాతపడ్డాయి. కృష్ణా జిల్లాలో వీచిన భారీ ఈదురు గాలులకు పలుచోట్ల ప్లెక్సీలు, హోర్డింగ్‌లు దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈదురుగాలులకు రెండు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

విజయనగరం, బొండపల్లి, డెంకాడ, నెల్లిమర్లలో చెదురుమదురు వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి.నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కావలి, కోవూరు, గూడూరు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.

గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.ఈదురుగాలులకు పలు పంటలు నేలకొరిగాయి. కళ్లాలోని ధాన్యం తడవకుండా రైతులు పట్టలు కప్పారు.పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఏలూరు, తాడేపల్లిగూడెం, పెనుమంట్ర, ఆచంట, భీమవరం, ఆకివీడు, మొగల్తూరు, దేవరపల్లి, పోలవరం పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది.రాయలసీయలో జల్లులు కురిశాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు