సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకుల డోర్ డెలివరీ.. జగన్ రెడీ

బుధవారం, 12 జూన్ 2019 (12:09 IST)
ఇంటిని వెతుక్కుంటూ రేషన్ సరుకులు వస్తాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. తమిళనాట ఈ ఎన్నికల వాగ్ధానాన్ని పలు పార్టీలు హామీగా ఇచ్చాయి. కానీ అవేం అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం రేషన్ సరుకులు ప్రజల ఇంటికి చేరేలా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. 
 
సీఎం పదవి చేపట్టిన గంటల్లోనే ప్రజా సంక్షేమ పథకాల అమలుపై తగిన చర్యలు తీసుకుంటున్న జగన్.. రేషన్ సరుకులు ప్రజలకు డోర్ డెలివరీ చేసే పథకాన్ని అమలు చేసే దిశగా కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకులు ప్రజల ఇంటికి చేరుకునే పథకాన్ని అమలు చేయనున్నారని తెలుస్తోంది. 
 
ఈ పథకం కోసం ఇప్పటికే గ్రామాల్లో పనిచేసే వాలంటీర్లు రంగంలోకి దిగారని.. రేషన్ సరుకుల్లో నాణ్యత కూడా కొరవడదని.. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వైకాపా వర్గాల సమాచారం. ఈ పథకం అమలు కోసం గ్రామాలు, నగరాల్లో వాలంటీర్లను ఎంపిక చేస్తారు. రేషన్ సరుకులను ప్యాకెట్ల రూపంలో ఇంటికే డెలివరీ చేస్తారు. ఇలా రేషన్ సరుకులు ఇంటికే చేరనుండటంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు