కాబోయే భార్యతో చూసి మాట్లాడివస్తానని వెళ్లి.. తిరిగినరాని లోకాలకు...

సోమవారం, 23 జనవరి 2017 (13:30 IST)
చిత్తూరు జిల్లాలో ఓ హృదయ విదారక సంఘటన ఒకటి జరిగింది. కాబోయే భార్యను చూసి ఓసారి మాట్లాడివస్తానని వెళ్లిన వరుడు.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాద ఘటన వివరాలను పరిశీలిస్తే.... 
 
రాయచోటి సమీపంలోని సుండుపల్లె మండలం పొలిమేరపల్లె పంచాయతీ పెద్దపల్లెకు చెందిన గురిగింజకుంట సుబ్బానాయుడి కుమారుడు శివకుమార్‌నాయుడు(20)కి మదనపల్లెలోని తన అమ్మమ్మ మనవరాలు శిరీషతో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో కాబోయే భార్యతో మాట్లాడి వస్తానని తన తల్లి రవణమ్మతో చెప్పి ఇంటి నుంచి మోటార్‌ సైకిల్‌పై మదనపల్లెకు బయల్దేరాడు.
 
మార్గమధ్యంలోని గుర్రంకొండ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ శివకుమార్‌‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు ఘటనాస్థలంలోని మొబైల్ ఫోన్ ఆధారంగా బాధితుని కుటుంబ సభ్యులకు, గుర్రంకొండ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు 108 సాయంతో హుటా హుటిన మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

వెబ్దునియా పై చదవండి