ఏపీ సర్కారుపై ఆర్ఆర్ఆర్ ఫైర్.. సాక్షుల్ని కాపాడండి..

సోమవారం, 13 జూన్ 2022 (12:42 IST)
ఏపీ సర్కారుపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడ్డదారుల్లో రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల లిక్కర్ బాండ్స్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. 
 
మార్జిన్ పేరుతో బెవరేజ్‌ కార్పొరేషన్‌కు ఆదాయాన్ని చూపించారన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, లిక్కరుపై ఎలాంటి ఆదాయం వచ్చినా ప్రభుత్వ ఖజానాకే చేరాలని స్పష్టం చేశారు. ఈ ఆదాయంపై బ్యాంకుల వద్ద ఏపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు చెప్పారు.  
 
మరోవైపు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి మృతిపై రఘురామ స్పందించారు. సాక్షి గంగాధర్ రెడ్డి మరణంపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ఇప్పటివరకూ ముగ్గురు సాక్షులు చనిపోయారని.. ఉన్న సాక్షులనైనా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 
 
జూలై 4న ప్రధాని మోదీ పర్యటన ఉందని, ఆ సందర్భంగా తన నియోజకవర్గానికి వెళ్లాలని అనుకుంటున్నట్లు రఘురామ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం ప్రధాని వస్తున్నారన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు