గుంటూరు జిల్లా చుండూరులో దళితుల ఊచకోత కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. చుండూరు కేసులో నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చుండూరు బాధితులు వేసిన పిటిషన్పై బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బిలోకూర్, జస్టిస్ సి.నాగప్పన్తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
ఈ సందర్భంగా చుండూరు కేసులో హైకోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్పై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చిన 52 మందికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తదుపరి విచారణపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. గుంటూరు జిల్లాలోని చుండూరులో 1991, ఆగస్టు 6న పలువురు దళితులను ఊచకోత కోసిన విషయం తెలిసిందే. చుండూరు కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 20 మందిని, ఇతర శిక్షలు అనుభవించిన మరో 36 మందిపై మొత్తం శిక్షలు రద్దు చేస్తూ 2014, ఏప్రిల్ 22న హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ తీర్పు పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. అదేసమయంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, మృతుల బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కింది కోర్టు ఇచ్చిన విచారణపై స్టే విధించడంతో పాటు నిందితులకు నోటీసులు జారీ చేసింది.