స్కూల్‌ బిల్డింగ్‌లు ఆహ్లాదకరంగా ఉండాలి: జగన్‌

మంగళవారం, 7 జులై 2020 (08:25 IST)
స్కూల్‌ బిల్డింగ్‌లకు వేసే కలర్స్‌ ఆహ్లాదకరంగా ఉండాలని, అక్కడ ఒక పండగ వాతావరణం కనిపించాలని సీఎం నిర్దేశించారు. పిల్లలకు అన్ని విషయాలపై తగిన అవగాహన కలిగేలా స్కూల్‌ గోడలపై చక్కగా బొమ్మలు కూడా గీయాలని సీఎం వైయస్‌ జగన్ ఆదేశించారు.

వర్షాకాల సీజన్‌ ముగిసిన తర్వాత ఆ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. లేకపోతే ప్రజాధనం వృథా అవుతుందని అన్నారు. 
 
మనబడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం, స్కూల్‌ భవనాలన్నింటికీ కొత్తగా పెయింటింగ్స్‌ వేయిస్తోంది. ఆ కలర్లకు సంబంధించి సీఎం వైయస్‌ జగన్‌  సమీక్ష నిర్వహించారు. ఆ మేరకు పలు రంగుల నమూనాలను అధికారులు సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో చూపారు. 
 
మరోవైపు మనబడి నాడు–నేడు కార్యక్రమంలో రెండవ, మూడవ దశ పనులు కూడా సకాలంలో చేపట్టేలా, అవసరమైన రుణాల సేకరణ ప్రక్రియ చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఇప్పుడు స్కూళ్లలో పనులు పేరెంట్‌ కమిటీలు చేస్తున్నాయి కాబట్టి, వాటిలో ఎలాంటి జాప్యం ఉండబోదని ఆయన పేర్కొన్నారు.
 
మనబడి నాడు–నేడు కార్యక్రమంలో ఇప్పుడు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్న అధికారులు రాష్ట్రవ్యాప్తంగా గంటకు రూ.2 కోట్ల విలువైన పనులు చేస్తున్నారని చెప్పారు.

అయితే పలు చోట్ల దాతలకు అప్పగించిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులు ప్రస్తావించడంతో, వెంటనే ఆ బాధ్యతల నుంచి దాతలను తప్పించి, పనులను జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని సీఎం ఆదేశించారు.
 
గ్రామ సచివాలయాల ఇంజనీర్లు మనబడి నాడు–నేడు పనులను కూడా చూడాలని, వారు ప్రతిరోజూ తప్పనిసరిగా స్కూళ్లు సందర్శించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

వారానికి ఒకసారి వారు తమ పనులపై నివేదిక ఇవ్వాలని కోరారు. అదే విధంగా స్కూళ్లలో పనులకు సంబంధించి ఎంబీ (మెజర్‌మెంట్‌ బుక్‌)లో రికార్డింగ్‌ పవర్స్‌ కూడా సచివాలయ ఇంజనీర్లకే ఇవ్వాలని, ఆ మేరకు ఎస్‌ఓపీ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు