'చంద్రయాన్-3' సక్సెస్ విజయంలో ఐదుగురు విశాఖ శాస్త్రవేత్తల పాత్ర

ఆదివారం, 27 ఆగస్టు 2023 (13:21 IST)
ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయంలో విశాఖపట్టణానికి చెందిన ఐదుగురు శాస్త్రవేత్తల పాత్ర ఉంది. ఉమ్మడి విశాఖకు చెందిన మోటమర్రి శ్రీకాంత్, అడ్డూరి రామచంద్ర, కె.రవీంద్ర, కొమ్మనమంచి భరజ్వాజ్, ఎస్.స్టీఫెన్ అనే ఐదుగురు శాస్త్రవేత్తలు తమ వంతు సహకారం అందించారు. 
 
ఈ ఐదుగురు శాస్త్రవేత్తల్లో శ్రీకాంత్ ఇస్రోలో మిషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు. ఈయన స్వస్థలం విజయనగరం జిల్లా సాలూరు. వీరి కుటుంబం ఆ తర్వాత విశాఖకు మారింది. ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన శ్రీకాంత్... ఆ తర్వాత ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరి, అంచలంచెలుగా ఎదిగారు. 
 
ఇక అడ్డూరి రామచంద్ర స్వస్థలం ఉమ్మడి విశాఖ జిల్లా కొత్తకోట. రైతు కుటుంబంలో జన్మించిన రామచంద్ర పాలిటెక్నిక్ చదివి, ఆపై బీటెక్, ఎంటెక్ చేసి ఇస్రోలో పరిశోధకుడిగా అడుగుపెట్టారు. చంద్రయాన్‌లో ల్యాండర్‌కు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఉన్న పేలోడ్స్, డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌లో రామచంద్ర కీలక పాత్ర పోషించారు. 
 
ఇస్రోలో యంగ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న కె.రవీంద్ర.. స్వస్థలం ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం. చంద్రయాన్-2లో ఎదురైన వైఫల్యాలను చక్కదిద్దే ఇస్రో బృందంలో రవీంద్ర సభ్యుడు. చిన్న వయసులోనే కీలక బాధ్యతల్లో పాలుపంచుకుటుండడం విశేషం.
 
కొమ్మనమంచి భరద్వాజ్ కూడా ఇస్రోలో సీ-గ్రేడ్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి వెంకట్రావు న్యాయవాది. రెండేళ్ల కిందటే శ్రీహరికోట షార్ కేంద్రంలో విధుల్లో చేరారు. తన ప్రతిభాపాటవాల కారణంగా చంద్రయాన్ -3 మిషన్‌లో కీలక సైంటిస్టుల బృందంలో ఒకరిగా కొనసాగుతున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు