హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం: ఆరుగురు సజీవదహనం

బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (10:46 IST)
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు. ఏవీ1 ఎయిర్‌కూలర్‌ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఆరుగురు మృత్యుపాలయ్యారు. 
 
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇందుకోసం ఆరు  అగ్నిమాపక యంత్రాలను వినియోగించారు. మృతులంతా బీహార్‌ వాసులుగా ఉన్నారనీ, వీరిలో సద్దాం, అయూబ్‌, ఇర్ఫాన్‌, షారూక్‌లను పోలీసులు గుర్తించారు. 
 
ప్రమాదం సంభవించిన వెంటనే యజమానికి కార్మికులు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కార్మికులున్న గోదాంకు బయటి నుంచి యజమాని తాళం వేయడం వల్లే కార్మికులు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రమాద సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన దుకాణ యజమాని ప్రమోద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి