తెలుగు చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన మహిళా నటి వాసుకి అలియాస్ పాకీజా ఇపుడు తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పూట గడవడం కోసం భిక్షాటన కూడా చేస్తున్నారు. ఈ విషయం ప్రధాన పత్రికాల్లో ప్రధాన శీర్షికల్లో వచ్చింది. దీన్ని చూసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. పాకీజా దీనస్థితి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్... తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేశారు.
మంగళవారం అమరావతిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ తరపున ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు కలిసి నటి వాసుకికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఇటీవల తన ఆర్థిక, అనారోగ్య సమస్యలు వివరిస్తూ, సాయం చేయాలని కోరుతూ విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. ఈ వీడియోలు పవన్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు.
ఈ సందర్భంగా నటి వాసుకి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు అండగా నిలిచిన పవన్కు ఆమె కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా పవన్ ఎదురుగా ఉంటే ఆయన కాళ్లు మొక్కుతానని, నా కష్టాన్ని అర్థం చేసుకుని ఆదుకున్నారు. ఆయన కుటుంబానికి జీవితాంతం రుణపడివుంటాను అని ఆమె పేర్కొన్నారు.
కాగా, గత 1990 దశకంలో పలు తెలుగు చిత్రాల్లో నటించిన వాసుకి.. మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాకీజా అనే పాత్రను ఆమె పోషించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు ఆమె పాత్రకు మంచి పేరు రావడంతో ఆమె పేరు పాకీజాగా ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ కాలక్రమేణా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.