త్వరలో వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ

గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:38 IST)
నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలతో పాటు ఎదురుమొండి పి. హెస్. సి లో ఖాళీగా ఉన్న వైద్య, సిబ్బంది పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు.

అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా జ్వరాలు, పాము కాటు గురై చికిత్స పొందుతున్న రోగులను ఎమ్మెల్యే సింహాద్రి పరామర్శించారు. అనంతరం డాక్టర్ నాగలక్ష్మి, డాక్టర్ హర్షతో మాట్లాడుతూ… ప్రస్తుతం సీజనల్ జ్వరాల కేసులు ఎక్కువగా ఉన్నందున ఓపీ ఎక్కువ సమయం చూసేలా సహకరించాలని కోరారు.

ఇలాంటి సమయంలోనే మీ సేవలు ఎంతో అవసరమని చెప్పారు. వర్షాకాలం వెళ్ళిపోతే ఇంత రద్దీ ఉండదని, ప్రభుత్వ వైద్య శాలలకు వైద్యం కోసం వచ్చిన వారందరికీ వైద్య సేవలు అందించాలని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జవహర్ రెడ్డిని మంగళవారం కలిసి అవనిగడ్డ ఏరియా వైద్యశాల, ఎదురుమొండి పీహెచ్సీలో ఖాళీగా ఉన్న డాక్టర్, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. త్వరలోనే ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని జవహర్ రెడ్డి హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే సింహాద్రి చెప్పారు.

రానున్న రోజుల్లో అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఆపరేషన్లు జరిగేలా చూస్తామని సింహాద్రి హామీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం నిలిచిపోయిన రక్తపరీక్ష సేవలను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో తిరిగి ప్రారంభించినట్లు ఎమ్మెల్యే సింహాద్రి తెలిపారు.

జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మురుగు నిల్వ లేకుండా, దోమలు నివారణకు చర్యలు తీసుకోవాలని పంచాయితీ ఈవో తోట శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ని ఎమ్మెల్యే ఆదేశించారు.

వర్షాలు తగ్గేవరకూ అప్రమత్తంగా ఉంటే జ్వరాలు రాకుండా నివారించవచ్చని ఎమ్మెల్యే రమేష్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రేపల్లె శ్రీనివాసరావు, మండల యూత్ అధ్యక్షులు చింతలపూడి బాలుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు