క్షమించండి ప్లీజ్: చంద్రబాబు

బుధవారం, 13 జనవరి 2021 (10:34 IST)
పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరన్నారు. రైతు కూలీలు చితికిపోయారని తెలిపారు. ప్రజావ్యతిరేకతపై నిర్ణయాలు మీద నిర్ణయాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. 7వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని... అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానని అడ్డంగా దొరికిన దొంగఅని వ్యాఖ్యానించారు.
 
ప్రజావేదిక కూల్చి ఇంతవరకు శిథిలాలు తీయకుండా పైశాచిక ఆనందం పొందే శాడిస్టు జగన్అ ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక డెకాయిట్ మాదిరి వ్యవహరిస్తున్నారన్నారు. బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా వాళ్ళు, బూతులు మంత్రులు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దాన్యం కొనుగోళ్లు బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రైతులకు మద్దతు ధర ఉండటంతో పాటు మార్కెట్ కమిటీలు కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

మీటర్లు వ్యవసాయ మోటర్లకు కాదు మంత్రులకు పెట్టాలని వ్యాఖ్యానించారు. వైసీపీ మంత్రులకు మీటర్లు పెడితే ఏ మంత్రి ఎంత దోచుకుంటున్నారో రియల్ టైమ్‌లో తెలుస్తుందన్నారు. ఫించన్లు పెంచుకుంటూ పోతానని మోసాగిస్తున్నారన్నారు. అప్పుల కోసమే మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు.
 
పట్టణాల్లో అన్నింటి పైనా పన్నులే అని... పెంపుడు జంతువుల పైనా పన్నులు విధిస్తున్నారని దుయ్యబట్టారు. గాలి రెడ్డి కాబట్టి రేపోమాపో గాలిపైనా పన్ను వేస్తారని యెద్దేవా చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారన్నారు. లక్షా 30వేల కోట్ల అప్పు, 70వేల కోట్ల పన్నులు మోపారని తెలిపారు.

ప్రతి ఒక్కరిపై ఇప్పటికే రూ.70వేలు భారం మోపారన్నారు. కుటుంబంలో నలుగురు ఉంటే రూ.2.80లక్షల భారం పడిందని.. ఈ భారం జీవితాంతం మోస్తూ ఊడిగం చేసే పరిస్థితి తెచ్చారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేశారని,  తానేం తప్పు చేసానో తనకు తెలీదని అన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశానని, అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని చంద్రబాబు కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు