న‌వంబ‌రు 11న శ్రీ వేదాంత దేశికర్ సాత్తుమొర‌

బుధవారం, 3 నవంబరు 2021 (20:04 IST)
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీవేదాంత దేశికర్‌ ఆలయంలో సాలకట్ల ఉత్సవాల సంద‌ర్భంగా న‌వంబ‌రు 11వ తేదీన సాత్తుమొర జ‌రుగ‌నుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఘంటా స్వరూపులు శ్రీవేదాంతదేశికర్‌. వీరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
 
న‌వంబ‌రు 2వ తేదీ నుండి ఆల‌యంలో సాల‌క‌ట్ల ఉత్స‌వాలు జరుగుతున్నాయి. ఉత్స‌వాల చివ‌రి రోజైన న‌వంబ‌రు 11న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీవేదాంత దేశికర్‌ ఆలయానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పా పడిని ఊరేగింపుగా తెచ్చి శ్రీ వేదాంత దేశికర్‌ వారికి సమర్పిస్తారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.
 
శ్రీవేంకటేశ్వరస్వామివారు జన్మించిన భాద్రపద మాసం శ్రవణ నక్షత్రంలోనే శ్రీవేదాంత దేశికర్‌  సుమారు 750 సంవత్సరాల క్రితం కాంచీపురంలోని తూప్పుల్‌ అగ్రహారంలో పుట్టారు. ఈయన స్వామివారిని కీర్తిస్తూ దయా శతకం అనే స్తోత్రం రచించారు. శ్రీవారి సుప్రభాతం రచించిన శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్‌కు శ్రీ వేదాంత దేశికర్‌ గురువర్యులు.
 
భ‌క్తుల భ‌ద్ర‌తే ధ్యేయంగా ప‌నిచేయాలి :
శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు, ప్ర‌ముఖుల భ‌ద్ర‌తే ధ్యేయంగా నిఘా, భ‌ద్ర‌తా సిబ్బంది ప‌నిచేయాల‌ని టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి కోరారు. తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్‌లో బుధ‌వారం విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలోని బాంబ్ డిస్పోజ‌ల్ బృందం కార్యాల‌యంలో ఘ‌నంగా ఆయుధ‌పూజ నిర్వ‌హించారు.
 
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిఎస్వో మాట్లాడుతూ తిరుమ‌ల‌కు రోడ్డు మార్గంలో, అలిపిరి, శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు నిర్వ‌హిస్తూ భ‌క్తుల‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న సిబ్బందికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

త‌నిఖీల సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా ఆశీస్సులు అందించాల‌ని శ్రీ‌వారిని, దుర్గామాత‌ను కోరుతూ ఆయుధ పూజ నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. అంత‌కుముందు శ్రీ‌వారు, దుర్గామాత చిత్ర‌ప‌టాల‌కు, భ‌ద్ర‌తాప‌రిక‌రాల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు