సేవా గుణాన్ని చాటుకున్న శ్రీకాళహస్తి పోలీస్ లు

బుధవారం, 25 ఆగస్టు 2021 (09:22 IST)
మాకేమని వదిలి పెట్టలేదు. ఎవరో చేస్తారని ఆగలేదు. తీవ్రతను గుర్తించారు, బాగు చేసారు. అందరి యందు శభాష్ అని అనిపించుకున్నారు. వారే శ్రీకాళహస్తి హైవే పెట్రోలింగ్ మరియు రక్షక్ సిబ్బంది.
 
శ్రీకాళహస్తి పట్టణంలో హైవే బై పాస్ వంతెన ఉన్నది. గత కొంత కాలంగా అధిక వర్షాలకు రహదారిపై గుంతలు గుంతలుగా ఏర్పడి వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది. తరచు ఈ గుంతల వలన ప్రమాదాలు కూడా జరిగేవి. వీటిని గుర్తించిన రక్షక్ మరియు హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులు తెలియపరిచి రోడ్డును మేము బాగుచేస్తామని ముందుకొచ్చారు. 
 
వీరి సేవగునాన్ని గుర్తించిన శ్రీకాళహస్తి డి.యస్.పి విశ్వనాధ్ శబాష్ అని తెలిపి ప్రోత్సహించారు. బైపాస్ వంతెనపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని రక్షక్ టీం మరియు హైవే పెట్రోలింగ్ సిబ్బంది చేపట్టి హైవే వంతెన పై ఉన్న గుంతలన్నింటిని పూడ్చివేసారు. ఈ వంతెనపై భారీ వాహనాలతో పాటు ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. గతంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 
 
ఈ కార్యక్రమంలో రక్షక్ టీం హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ లు ప్రసాద్, మునస్వామి,  హైవే పెట్రోలింగ్ హెడ్ కానిస్టేబుల్ గోపాలరాజు, కానిస్టేబుల్ కన్నయ్య పాల్గొన్నారు. వీరు చేసిన సేవాపరమైన మంచి కార్యక్రమానికి అక్కడి స్థానికులు ప్రతిరోజు ఈ దారిగుండా వెళ్ళే వాహనదారులు అందరు హర్షాన్ని వ్యక్తం చేసారు.
 
వీరి సేవను గుర్తించిన తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు,  ప్రత్యేకంగా రక్షక్ మరియు హైవే పెట్రోలింగ్ సిబ్బందిని అభినందనలు తెలుపుతూ వీరిని జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది అందరు స్పూర్తిగా తీసుకొని ప్రజలకు సేవ చేసి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు