హోదా అంశాన్ని ఎన్డీసీకి పంపితే పుణ్యకాలం కాస్త అయిపోతుంది : సుజనా చౌదరి

బుధవారం, 7 సెప్టెంబరు 2016 (11:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా కేటాయించాలని కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ప్రస్తుతం హస్తినలో ఏపీకి కేటాయించాల్సిన ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీపై ఢిల్లీలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో సుజనా చౌదరిలతో పాటు మరో ఎంపీ సీఎం రమేష్‌లు పలు దఫాలుగా కేంద్ర మంత్రులతో చర్చలు సాగుతున్నాయి.
 
ఇదే అంశంపై కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, వెంకయ్యతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని, తాము హోదా కోసమే పట్టుబడుతున్నామన్నారు. హోదా అంశాన్ని మళ్లీ ఎన్డీసీకి పంపాలని కేంద్ర పెద్దలంటున్నారు. ఎన్డీసీకి పంపితే పుణ్యకాలం కాస్తా అయిపోతుందని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని అంశాలు, ఏపీ భవన్ విభజనపై రాజ్‌నాథ్, వెంకయ్యతో చర్చించామన్నారు.
 
అంతకుముందు ఉదయం కేంద్రంహోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌తో వీరిరువురు భేటీ అయ్యారు. ప్రత్యేక ప్యాకేజ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. నిధుల పెంపుపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హోదాతో సమానమైన ప్యాకేజ్‌ను ఏపీకి ప్రకటిస్తామని రాజ్‌నాథ్ వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై డీపీఆర్‌లను రాష్ట్రం పంపితే తగిన నిధులను విడుదల చేస్తామని కూడా చెప్పినట్లు తెలిసింది. పోలవరానికి 99 శాతం నిధులను కేంద్రమే భరించేలా ప్యాకేజీని రూపొందిస్తున్నారు.
 
ఇదిలావుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం వెలగపూడిలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రద్దు చేసుకున్నారు. తన నివాసంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్రం ప్రకటించే ప్యాకేజీ ప్రతిపాదనలపై ఈ సందర్భంగా చర్చించారు. 

వెబ్దునియా పై చదవండి