రూ.లక్ష కోట్లు దొబ్బేసి జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ఏం విజన్ ఉంటుంది? నారా లోకేశ్ ప్రశ్న

ఠాగూర్

శుక్రవారం, 8 మార్చి 2024 (11:34 IST)
రాష్ట్రంలోని బీసీ కులాలకు చెందిన ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్దరించారని, ఆయన పొడిచిందేమిటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. తాను చేపట్టిన శంఖారావం యాత్రలో భాగంగా, గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లక్ష కోట్లు దొబ్బేసి జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ఏం విజన్ ఉంటుంది? అని ప్రశ్నించారు. అతడికి మద్యం ద్వారా ఎలా సంపాదించాలి? క్వారీల్లో ఎలా డబ్బులు సంపాదించాలి... ఇసుకలో ఎలా డబ్బులు లేపేయాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఉత్తరాంధ్రకు వెళ్లి తనకు విజన్ ఉంది అంటున్నాడు అని ఎద్దేవా చేశాడు. 
 
'మూడేళ్లుగా 3 రాజధానులతో మనల్ని ఆడుకున్నాడు. విశాఖలో జగన్ మొదట చేసింది ఏంటో తెలుసా? రూ.500 కోట్లు ఖర్చుపెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. బాత్రూమ్‌లో రూ.25 లక్షలతో కమోడ్ పెట్టుకున్నాడు. బస్ షెల్టర్‌కు కూడా ఫొటోలు పెట్టుకున్నాడు. అవి గాలి వస్తే ఊడిపోతున్నాయి. ఇటీవల సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి కడితే అది కూడా కొట్టుకుపోయింది" అని ఎద్దేవా చేశారు.
 
జగన్మోహన్ రెడ్డిని సూటింగా ప్రశ్నిస్తున్నా... ఎన్నికల ముందు బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని అన్నాడు. కానీ బీసీల వెన్ను విరిచాడు. బీసీలకు జగన్ పొడిచిందేంటి? అందుకే బీసీలకు డిక్లరేషన్ తీసుకొచ్చాం. 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4 వేల నెలకు పింఛన్ ఇవ్వబోతున్నాం. బీసీల రక్షణకు చట్టం తీసుకురాబోతున్నాం. సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ.5 వేల కోట్లతో ఆదరణ ద్వారా పనిముట్లు కూడా అందిస్తాం. చంద్రన్న బీమా 10 లక్షలు, పెళ్లి కానుక ద్వారా రూ.లక్ష ఇవ్వబోతున్నాం. అధికారుల చుట్టూ ఆరునెలలకు ఒకసారి తిరగకుండా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రం ఇస్తాం. పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలు నిర్మిస్తాం అని ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు