టీడీపీకి మద్దతు పలికారనీ.. కుప్పంలో అంగన్‌వాడీల తొలగింపు

గురువారం, 2 నవంబరు 2023 (10:30 IST)
ఏపీలోని వైకాపా ప్రభుత్వం పగ ప్రతీకారంతో రగిలిపోతుంది. ప్రభుత్వ నుంచి వేతనాలు తీసుకునే ఉద్యోగులు ఎవరైనా సరే తమకు కాకుండా టీడీపీ, జనసేన వంటి పార్టీలకు మద్దతు తెలుపడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. అలాంటి వారిపై కక్షగట్టి మరీ వేధిస్తుంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం కోసం ఆందోళనలు చేశారు. వీరికి మద్దతు తెలిపిన అంగన్‌వాడీ సిబ్బందిపై వేటు వేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలను ఐసీడీ‌ఎస్ అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. మరో 65 మందికి వేతనంలో కోత విధించారు. 
 
అంగ న్వాడీ సమస్యలపై సెప్టెంబరు 25న విజయవాడలో జరిగిన ఆందోళనకు కుప్పం నియోజకవర్గ ఐసీడీ‌ఎస్ పరిధిలోని అంగన్‌వాడీలు 24న నాలుగు బస్సుల్లో బయలుదేరారు. అయితే మధ్యలోనే అడ్డగించిన పోలీసులు... అంగన్‌వాడీ వర్కర్లను పోలీసు స్టేషన్లకు తరలించి తర్వాత వదిలేశారు. దీనికి నిరసనగా అంగన్‌వాడీలు 25న చంద్రబాబు ఆక్రమ అరెస్టుపై కుప్పంలో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షల్లో పాల్గొన్నారు. చంద్రబాబుకు న్యాయం జరగాలని, అలాగే తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీగా టీడీపీ మద్దతు తెలపాలని కోరారు. 
 
ఈ నేపథ్యంలో ఐసీడీ‌ఎస్ అధికారులు కుప్పం మున్సిపాలిటీలోని రాజీవ్ నగర్ అంగన్‌వాడీ వర్కర్ ప్రమీల, గుడుపల్లె మండలం శెట్టిపల్లె పంచాయతీ కప్పలనత్తం అంగన్‌వాడీ కార్యకర్త కవితను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ మండలాలకు చెందిన మొత్తం 65 మంది అంగన్‌వాడీలకు వారం రోజుల వేతనం కోత విధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుప్పం పట్టణంలో జరిగిన ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నందున వీరిపై చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి