మీ ఇష్టానికి ఫీజుల వసూలు కుదరదు : ఏపీ సర్కారుకు సుప్రీం షాక్

బుధవారం, 15 జులై 2020 (11:04 IST)
ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడంకుదరని పేర్కొంది. ఈ విషయంలో అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సు చేసిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడం కుదరదని స్పష్టం చేసింది. 
 
ఇంజనీరింగ్ ఫీజుల వసూలు విషయంలో గత యేడాది జూలై 23వ తేదీన ప్రభుత్వం జీవో నంబరు 38 విడుదల చేసింది. ఈ జీవోను ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు హైకోర్టులో సవాల్‌ చేశాయి. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఎం.గంగారావు జీవోను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసుల మేరకే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. 
 
అయితే... సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. అనంతరం సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో హైకోర్టు మార్పుచేసింది. 2018-19 విద్యా సంవత్సరపు ఫీజుకు, 2019 జూన్‌లో ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజుకు మధ్య ఉన్న తేడాలో 50 శాతాన్ని పాత ఫీజుకు కలిపి అమలు చేయాలని జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. 
 
హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వును సవాల్‌ చేస్తూ 23 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. 2019-20 నుంచి మూడేళ్లకు ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాయి. దీనిపై మంగళవారం జస్టిస్‌ నారిమన్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. 
 
గతంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు