ఆనందయ్య కరోనా మందు.. పరిశోధనపై పురోగతి.. అధ్యయనం పూర్తి

శుక్రవారం, 28 మే 2021 (10:10 IST)
కరోనా ఆనందయ్య మందుపై అధ్యయనం పూర్తి అయ్యింది. ఇప్పటికే ఆనందయ్య మందు పరిశోధన పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొ.బలరాం భార్గవ్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు.

మందును వాడిన 570 మంది నుంచి వివరాలు సేకరించి, పరి శోధన జరుపుతున్నామని కేంద్ర మంత్రి వివరించారు. వీలైనంత త్వరలోనే పరిశోధన పూర్తి చేసి నివేదికను సిద్ధం చేస్తామన్నారు.

ఈ మందు ఆయుష్‌ విభాగ పరిధిలోనిది గనుక, ఇప్పటికే ఆయుష్‌ వారి పరిశోధన ప్రారంభమై, కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ అదనంగా ఐసీఎంఆర్‌ విచారణ అవసరం లేదని బలరాం భార్గవ్‌ ఉపరాష్ట్రపతికి చెప్పారు.
 
ఈ నేపథ్యంలో కరోనా నివారణకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన మందు తీసుకున్న వారిపై ఆయుర్వేద వైద్య బృందం విచారణ పూర్తి చేసింది.

నివేదికను సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌)కు పంపింది. నివేదికను పరిశీలించాక వారు ఇచ్చే ఆదేశాల కోసం ఆయుర్వేద వైద్య బృందం ఎదురుచూస్తోంది. దీనిపై తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరి శోధన సంస్థ సంయుక్తంగా కమిటీ ఏర్పాటైంది.
 
ఈ కమిటీ సభ్యులు ఆనందయ్య వద్ద మందు తీసుకున్న 570 మంది వివరాలను సేకరించారు. వీరిలో అందుబాటులోకి వచ్చిన 380 మందితో మాట్లాడారు. కరోనా రాకుండా ఉండేందుకు, పాజిటివ్‌ వచ్చాక మందు తీసుకున్న వారు, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన తరువాత మందు తీసుకున్న వారితో వివరంగా మాట్లాడారు. మందు తీసుకున్న తరువాత పాజిటివ్‌ ఎవరికైనా వచ్చిందా? లేదా?, అనా రోగ్య సమస్యలు తలెత్తాయా? వంటి వివరాలను సేకరించారు.
 
కమిటీ విచారణలో దాదాపు అందరూ ఆనందయ్య మందుకు అనుకూలంగానే అభిప్రాయం తెలియజేసినటు సమాచారం. కాగా, ఆనందయ్య మందు జంతువులపైనా ప్రయోగించేందుకు తిరుపతి సమీపంలోని సృజన లైఫ్‌ ల్యాబ్‌ ఎదురుచూస్తోంది. జంతువులపై ప్రయోగాలకు అర్హతపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిపుణులతో చర్చించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు