అచ్చెన్న అరెస్టు.. జగన్ కక్ష సాధింపునకు పరాకాష్ట: చంద్రబాబు

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (11:02 IST)
తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తక్షణమే అచ్చెన్నను బేషరతుగా విడుదల చేసి ఆయనపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 
 
అచ్చెన్నాయుడు అరెస్టు జగన్ కక్ష సాధింపునకు పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై జగన్ కక్ష కట్టారని.. శ్రీకాకుళం జిల్లాలో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో గత 40 ఏళ్లలో ఇలాంటి ఉద్రిక్తతలు లేవని.. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించిందెవరని చంద్రబాబు ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడిపై పెడతారా అని ధ్వజమెత్తారు. 
 
కాగా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన నివాసంలో అచ్చెన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోటబొమ్మాళి పోలీసుస్టేషన్‌కు ఆయన్ను తరలించారు. 
 
పంచాయతీ తొలివిడత నామినేషన్లలో వైకాపా, తెదేపా నేతల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంపై కోటబొమ్మాళి పీఎస్‌లో 22 మందిపై కేసు నమోదు అయింది. నిన్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా.. అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు