ఇకపై సాంప్రదాయ రాజకీయాలు నడవవు... ఢీ అంటే ఢీనే!

మంగళవారం, 4 జనవరి 2022 (20:11 IST)
తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా తమకు అడుగులకు మడుగులొత్తే  వారికి నామినేటెడ్ పదవులు, ఇత‌ర ల‌బ్ది చేకూర్చార‌ని, అటువంటి వారంతా అధికారం పోగానే ప్రత్యర్థుల పక్షాన చేరిపోయారని చంద్ర‌బాబు అన్నారు. ఈ విష‌యంలో జ‌రిగిన త‌ప్పులను గుర్తు పెట్టుకుని వ్య‌వ‌హ‌రించాల‌ని నేత‌ల‌ను చంద్ర‌బాబు సూచించారు. త్వరలో జరగబోయే 22 మున్సిపాలిటీల ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీ అంటే ఢీ అని ఎదుర్కోగలిగే అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించాలని పేర్కొన్నారు. 
 
 
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం 22 మున్సిపాలిటీలకు చెందిన పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము పోటీచేసే ఎన్నికలు కాదుకదా అని కొందరు నాయకులు స్థానిక ఎన్నికలను నిర్లక్ష్యం చేయడంతో న‌ష్టం జ‌రిగింది. ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న చోట్ల గట్టిపోటీ ఇచ్చి కొన్నిచోట్ల విజయం సాధించామని తెలిపారు. టిడిపి ఓట్లను తొలగించడం, దొంగఓట్లను నమోదుచేసుకోవడం వంటివి కూడా పెద్దఎత్తున జరిగాయని తమ దృష్టికి వచ్చిందని, ఓటరు లిస్టులను సరిచూసుకుని అప్పీలుకు వెళ్లాల్సిందిగా సూచించారు. 
 
 
త్వరలో ఎన్నికలు జరిగే మున్సిపాల్టీల్లో ఎక్కడ నామినేషన్లు, గెలుపు ప్ర‌య‌త్నంలో విఫలమైనా అక్కడి పార్టీ ముఖ్యనేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సీనియర్ నాయకులు కూన రవికుమార్, జివి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు