తెదేపా రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య.. తెరాస అభ్యర్థులు వీరే...

బుధవారం, 11 మార్చి 2020 (08:12 IST)
రాజ్యసభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. తమ పార్టీ తరపున వర్ల రామయ్యను బరిలో నిలుపుతున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఈ మేరకు వెల్లడించారు. 
 
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేస్తామని, పార్టీ ఏజెంట్‌కు చూపించి ఓటేయాలని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. 
 
అటు, వైసీపీ ఇప్పటికే తన నలుగురు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఏపీ నుంచి వైసీపీ పక్షాన రాజ్యసభ బరిలో ఉన్నారు.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించనున్నారు. రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల నుంచి వీరిని పంపాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం.
 
కాగా, ఈ సీట్లను ఆశించిన వారిలో నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మందా జగన్నాథం, దామోదర్‌రావు, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథి రెడ్డి  వంటి వారు ఉన్నారు. కానీ, చివరికి కేకే, పొంగులేటి వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు