విద్యార్థులకు మంచి బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే నువ్వా నేనా అంటూ జగడానికి దిగారు. అదీ విద్యార్థుల ముందే టీటర్లు కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదంతా కడప జిల్లాలోని సుండుపలి మండలం రెడ్డివారి పల్లె ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య రాజకీయాలు జరుగుతున్నాయి. టీచర్లు రెండు వర్గాలుగా విడిపోయి.. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. విద్యార్థుల ముందే వాదులాటకు దిగేవారు.
అది కాస్త శ్రుతిమించింది. బుధవారం స్కూలుకొచ్చిన టీచర్లు చిన్న విషయమై వాగ్వాదం చేసుకున్నారు. దీంతో ఒక వర్గం వారు ఇన్ ఛార్జ్ హెడ్ మాస్టర్ కదిరి నాయకల్పై దాడికి పాల్పడ్డారు. ఈ జగడం కాస్త తన్నుకునేంత వరకు పోయింది. అరుపులు, కొట్లాటలు చూసి భయపడిన విద్యార్థులు పరుగున వెళ్లి స్థానికులకు విషయం చేరవేశారు. దీంతో స్థానికులు రంగంలోకి దిగి ఉపాధ్యాయుల గొడవకు బ్రేక్ వేశారు.