రాష్ట్ర విభజనతో ఏపీ, తెలంగాణ విడిపోయాక ఉద్యోగ దంపతులకు పెద్ద సమస్య వచ్చిపడింది. తెలంగాణలో చాలాకాలం పాటు పనిచేసిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కు కంటతడితో స్థానికత కారణంగా వెళ్ళిన నేపథ్యంలో.. ఉద్యోగులైన భార్యాభర్తలు పోస్టింగ్ పరంగా ఏపీ, తెలంగాణల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఉద్యోగ దంపతులకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త అందించాయి.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జోనల్, మల్టీ జోనల్, జిల్లా, స్థానిక ఉద్యోగులకు సంబంధించి స్పౌజ్ (ఉద్యోగ దంపతులు) కేసులతో పాటు పరస్పర అంగీకారంతో కూడిన బదిలీల ప్రక్రియలో కదలిక వచ్చింది. విభజన నేపథ్యంలో వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేస్తున్న దంపతులకు ఒకే రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు కానుంది.
స్థానిక, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర విభజన నాటికి ఎవరెక్కడ పనిచేస్తున్నారో, అక్కడ పనిని కొనసాగించాలంటూ ఆదేశాలున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ఉద్యోగులు ఏపీ సర్కారులోనూ, వారి భాగస్వాములు మాత్రం తెలంగాణలో పనిచేస్తున్నారు.
అలాగే ఏపీకి చెందిన పలువురు ఉద్యోగులు తెలంగాణలోనూ, వారి భాగస్వాములు ఏపీలో పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఒక చోట వేసేందుకు బదిలీ ప్రక్రియను వేగవంతం చేశాయి.