ఎప్పుడు ఫోన్ చేసినా భార్య ఫోన్ ఎంగేజ్, కొండ పైకి తీసుకుని వెళ్లి...

బుధవారం, 7 ఏప్రియల్ 2021 (20:53 IST)
ఇటీవలి కాలంలో పలువురు సెల్ ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. ఇంటికి బంధువులు వచ్చినా సెల్ ఫోనుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ బంధువులకి ఇవ్వడంలేదని చెప్పేవారు వున్నారు. మరికొందరు గంటల తరబడి స్నేహితులతో మాట్లాడటం, చాటింగ్ చేయడం చేస్తుంటారు. మొత్తమ్మీద పలువురు ఈ ఫోన్ మాయలో పడిపోయి కుటుంబాన్ని పూర్తిగా అశ్రద్ధ చేస్తుంటే మరికొందరు తమ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు.
 
ఇలాంటి ఘటనే విజయనగరంలోని కుమిలిలో జరిగింది. భార్యకు ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తుండటంతో భర్తకు అనుమానం కలిగింది. ఆమె ఎవరితోనో గంటల తరబడి మాట్లాడుతోందని అనుమానం పెంచుకుని సమీపంలో వున్న కొండపైకి తీసుకెళ్లి అక్కడ ఆమెను హత్య చేసినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
వివరాలు చూస్తే.. మండలం లోని కొండగుడ్డికి చెందిన 35 ఏళ్ల పుష్ప, శ్రీను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే భార్య తరచూ ఎవరితోనో ఫోన్లో గంటలతరబడి మాట్లాడటంపై ఆమెతో పలుమార్లు గొడవపడ్డాడు శ్రీను. ఈ క్రమంలో ఆమె కొన్నాళ్లు పుట్టింటికి కూడా వెళ్లింది. ఇటీవలే నచ్చజెప్పి మళ్లీ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఆమె వరస మారలేదు.
 
నిత్యం ఫోన్లో మాట్లాడుతూ వుండటంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సమాచారం మేరకు.. ఆమెని సమీపంలోని కొండపైకి తీసుకెళ్లి హత్య చేసి, ఏమీ ఎరుగనట్లు తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని పురుగుల మందు తాగి ఆస్పత్రిలో జాయన్ అయ్యాడు. ఐతే ఎంతకీ తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతలో కొండపై గుర్తు తెలియని మహిళ శవం వుందని పోలీసులకి మంగళవారం సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా ఆ శవం పుష్పదేనని నిర్థారించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు