ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధిపతిగా పవన్ కళ్యాణ్ కావాలి : సోము వీర్రాజు

సోమవారం, 29 మార్చి 2021 (09:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధిపతిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కావాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా జనసేనానికి సముచిత స్థానం కల్పించాలని సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమకు సూచించారని వెల్లడించారు. 
 
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ - జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె గెలుపుపై ఇరు పార్టీలు ఫోకస్ పెట్టాయి. 
 
ఇందులోభాగంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ హోటల్లో ఇరు పార్టీ నేతల సమన్వయ సమావేశం జరిగింది. ఉప ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 
 
ఇందులో సోము వీర్రాజు మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి అధిపతిగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావాలన్నారు. అలాగే, పవన్ కళ్యాణ్‌కు సముచిత గౌరవం ఇవ్వాలని నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే తమకు సూచించారని వెల్లడించారు. 
 
ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, అటు ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలను ఎండగట్టాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి విజయం కోసం పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ సైతం ప్రచారం చేసేందుకు తిరుపతి రానున్నారని వెల్లడించారు. 
 
ఇరు పార్టీల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా ముందుకు సాగాలని.. ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించారు. కాగా, రత్నప్రభ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందులో ఇరు పార్టీల నేతలు పాల్గొననున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు