నేడు సున్నా వడ్డీ పంట రుణాల నగదు పంపిణీ

మంగళవారం, 26 అక్టోబరు 2021 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పథకాలకు డబ్బు జమ చేయనుంది. వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌, సున్నావడ్డీ పంట రుణాల రీయింబర్స్‌మెంట్‌, వైఎస్సార్‌ యంత్రసేవా పథకం లబ్ధిదారులకు డీబీటీ పద్ధతిలో మంగళవారం నగదు జమచేయనున్నారు. ఈ మూడు పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మీట నొక్కి నిధులు విడుదల చేస్తారు. 
 
మంగళగిరిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొంటారు. ఈ ఏడాది రైతు భరోసా పథకంలో రెండో విడతగా 50.37 లక్షల మందికి రూ.2,052 కోట్లు, 2020 ఖరీఫ్‌లో రూ.లక్షలోపు రుణం తీసుకుని, వడ్డీతో సహా ఏడాదిలో చెల్లించిన 6.67 లక్షల మంది రైతులకు సున్నావడ్డీ కింద రూ.112.7 కోట్లు మంజూరు చేయనున్నారు. 
 
అదేవిధంగా యంత్రసేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు రూ.25.55 కోట్లు జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ ప్రభుత్వం వివిధ రకాలైన సంక్షేమ పథకాలకు భారీ మొత్తంలో నగదును జమ చేస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు