శ్రీకాకుళం జాతీయ రహదారిపై పాత రూ.500 నోట్ల వర్షం!

ఆదివారం, 5 మార్చి 2023 (11:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారిపై పాత రూ.500 నోట్ల వర్షం కురిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓ ఆటోలో పాత రూ.500 నోట్లు తరలిస్తుండగా అనేక నోట్లు గాలికి ఎగిరిపడ్డాయి. ఇది స్థానికంగా కలకలం రేపింది. పైగా, పలు అనుమానాలకు తావిస్తుంది. జిల్లాలోని నరసన్నపేట మండలం మడపాం టోల్‌గేట్‌వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఆటోలో నుంచి రూ.500 నోట్లు కిందపడటాన్ని గమనించిన టోల్ సిబ్బంది ఆటో డ్రైవర్‌ కోసం కేకలు వేశారు. అతనికి వినిపించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై టోల్‌ప్లాజా సూపర్ వైజర్ ఢిల్లేశ్వర రావు, కృష్ణారావు తదితరులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. నరసన్నపేట ఎస్ఐ సింహాచలం టోల్‌‍గేట్ వద్దకు చేరుకుని సీసీటీవీ ఫుటేజీని దృశ్యాలను పరిశీలించాడు. ఇందులో శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వెళుతున్న పసుపురంగ ఆటోలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో పురుషులు మద్యం మత్తులో ఉన్నట్టు గ్రహించారు. 
 
కరజాడ వద్ద నుంచే వీరు నోట్లు విసురుకుంటూ వస్తున్నట్టు తేలింది. టోల్‌గేట్ వద్దకు వచ్చేసరికి మరిన్ని ఎక్కువ నోట్లను విసిరివేశారు. అయితే, ఈ డబ్బు ఎవరిది.. ఎందుకు రోడ్లపై విసిరివేశారు అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్క టోల్ గేట్ వద్దే రూ.88 వేలు లభించింది. కరజాడ నుంచి టోల్‌‍గేట్ వరకు పడిన నోట్లను లెక్కిస్తే రూ.లక్షల్లో ఈ నోట్లు ఉండొచ్చని పోలీసలు భావిస్తున్నారు. ప్రస్తుతానికి రూ.88 వేలను స్వాధీనం చేసుకున్నామని, వీటిని సోమవారం తాహసీల్దారు ద్వారా కోర్టుకు పంపుతామని వారు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు