మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమం... పౌరహక్కుల సంఘం నేత వరవరరావు వెల్లడి

శుక్రవారం, 4 నవంబరు 2016 (09:28 IST)
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆచూకీ లేకుండా పోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ అలియాస్‌ ఆర్కే క్షేమంగానే ఉన్నట్టు తమకు సమాచారం అందిందని పౌర హక్కుల సంఘం నేత వరవరరావు చెప్పారు. 
 
ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకనేత ఆర్కే కనిపించకుండా పోవడంతో పెద్దఎత్తున ఆందోళనవ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆయన ఆచూకీ తెలపాలంటూ పౌరహరక్కుల సంఘాల నేతలు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.
 
ఈ నేపథ్యంలో వరవరరావు మాట్లాడుతూ... ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆర్కే జాడ లేకపోవడంతో తామంతా ఆందోళన చెందామన్నారు. చివరకు పదిరోజుల తర్వాత ఆయన క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. 
 
ఏవోబీతో పాటు తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పోలీసుల నిర్బంధం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. గాలింపు చర్యలు వెంటనే నిలిపివేయాలని కోరారు. ఏవోబీలో మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపారనడంలో సందేహం లేదని, ఈ ఘటనపై న్యాయ విచారణజరపాలని డిమాండ్‌చేశారు. 

వెబ్దునియా పై చదవండి