ట్రిపుల్ తలాక్ ముస్లిం పురుషులను శిక్షించేందుకే: ఓవైసీ

మంగళవారం, 23 జనవరి 2018 (13:00 IST)
ఎన్నికల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లలో రూ. 15లక్షలు జమ చేస్తామని తప్పుడు హామీలు ఇచ్చారని.. ఆ డబ్బు వేయకపోయినా.. కనీసం ట్రిపుల్ తలాక్ బాధితుల అకౌంట్లలోకి రూ.15వేలైనా వేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు.  దీనికోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. 
 
న్యాయం పేరుతో ఇస్లామిక్ చట్టం 'షరియత్'ను ప్రధాని మోదీ లక్ష్యంగా చేసుకుంటున్నారని అసదుద్ధీన్ మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ విషయాన్ని బీజేపీ నేతలు స్వార్థ లాభాల కోసం వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ముస్లిం పురుషులను.. ఆ సమాజాన్ని శిక్షించేందుకే ట్రిపుల్ తలాక్ బిల్లును తెరపైకి తీసుకొచ్చారని ఓవైసీ ఆరోపించారు. కాగా.. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో మాత్రం మద్దతును కూడగట్టలేకపోయిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీకి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల కర్నూలు పర్యటనలో కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని మోదీ లేవనెత్తడం వల్లనే ముస్లింలందరూ ఏకమయ్యారని కితాబిచ్చారు. అలాగే కేంద్రం ముస్లిం మహిళలపై ప్రేమ ఉంటే రూ. 2 వేల కోట్లు కేటాయించి ప్రతిమహిళకు 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరైనా ఒకేసారి మూడు సార్లు తలాక్‌ చెబితే సమాజ బహిష్కరణ చేయండని మహిళలకు ఓవైసీ పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు