కేసీఆర్‌కు షాకిచ్చిన తెరాస నేత.. రాత్రికి రాత్రే టీడీపీలో చేరిక

ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (12:55 IST)
అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడిన తెరాస సీనియర్ నేత మొవ్వా సత్యనారాయణ రాత్రికిరాత్రే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈయన శేరిలింగంపల్లి అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశించారు. ఆ టిక్కెట్ దక్కక పోవడంతో ఆయన పార్టీ మారారు. ఈ నియోజకవర్గంలో ఈయన మంచి ప్రాబల్యం కలిగివున్న నేతగా గుర్తింపు పొందారు. 
 
దీంతో ఒక్కసారిగా శేరిలింగంపల్లిలో రాజకీయ సమీకరణాలు మారాయి. నిజానికి ఈ నియోజకవర్గంలో టికెట్‌ ఆశించి భంగపడిన మరో నేత, కార్పొరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ కూడా తన అనుచరులతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 
 
2014లో టీడీపీ తరపున టికెట్‌ ఆశించి భంగపడిన మొవ్వా 2015లో తెరాసలో చేరారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌ అధిష్టానం 2019లో ఎమ్మెల్యే టికెట్‌కానీ, నామినేటెడ్‌ పదవి కానీ ఇస్తామని మొవ్వాకు హామీ ఇచ్చింది. కానీ, ఇపుడు మొండి చేయి చూపింది. సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో మొవ్వా తిరిగి సొంత గూటికే చేరుకున్నారు. 
 
అంతేకాకుండా, శేరిలింగంపల్లి టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌తో పాటు నియోజకవర్గ పార్టీ బాధ్యతలను మొవ్వాకు అప్పగించాలని కోరుతూ పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు భారీ సంఖ్యలో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌కు చేరుకుని అధిష్ఠానానికి వినతిపత్రం సమర్పించారు. 
 
విషయాన్ని అధినేత చంద్రబాబుకు తెలియజేశారు. వారి అభ్యర్థన మేరకు చంద్రబాబు నాయుడు ఫోన్‌లో సీనియర్‌ నాయకులతో చర్చించి మొవ్వా సత్యనారాయణను ట్రస్టు భవన్‌కు పిలిపించుకుని మీడియా సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు