ఖమ్మం పాలేరు బైపోల్ : తెరాస అభ్యర్థి తుమ్మల విజయభేరీ

గురువారం, 19 మే 2016 (13:08 IST)
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార తెరాస అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజయభేరీ మోగించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు తెరాస తిరుగులేని శక్తిగా మారిన విషయం తెల్సిందే. సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపించాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 
 
పాలేరు ఉప ఎన్నికలో తెరాస తరపున పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భారీ మెజార్టీతో గెలిచారు. 45,750 ఓట్ల ఆధిక్యంతో తుమ్మల విజయం సాధించారు. తెరాస గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. కమ్యూనిస్టులు పత్తా లేకుండా పోయారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కూటమి పోటీని ఇవ్వలేకపోయాయి. కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి సుచరితా రెడ్డి, సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్ పోటీ చేసిన విషయం విదితమే.
 
ఈ విజయంపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాలేరు ఓట్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీఆర్‌ఎస్ గెలుపు అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రభుత్వంపై, తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఉన్నందునే ఈ విజయం సాధ్యమైందన్నారు. 

వెబ్దునియా పై చదవండి