మిస్టర్ జగన్.. నీకేమైనా జైలు కొత్తనా? అలా చేస్తే చరిత్రలో నిలిచిపోతావ్ : ఉండవల్లి

సోమవారం, 5 ఏప్రియల్ 2021 (08:29 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ సూచన చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంతో పోరాటానికి దిగాలని ఉండవల్లి పిలుపునిచ్చారు. 
 
స్టీల్ ప్లాంట్‌కు మద్దతుగా ప్రచారం చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ జైలుకు పంపిస్తారన్న భయం జగన్‌కు ఉండొచ్చన్నారు. అయితే, జగన్‌కు జైలుకెళ్లడం కొత్తా అని వ్యాఖ్యానించారు. పైగా, విశాఖ కోసం జైలుకెళితే ప్రజల గుండెల్లో జగన్ స్థిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 
 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నాయన్నారు. అవినీతి కారణంగానే కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోందన్నారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఎందుకు భయపడాలి అని ఉండవల్లి ప్రశ్నించారు. 
 
"పోతే జైలుకే పోతారు. జైలేమైనా కొత్తా నీకు... జైలుకెళ్లు. దేనికి భయపడడం. ఇప్పుడు జరుగుతోంది.. సోషలిజం వర్సెస్ క్యాప్టలిజం. మీరు నాయకత్వం తీసుకోండి. ఇవాళ మీరు గనుక వెనకడుగు వేస్తే... అది మీ తప్పుగానే జనం భావిస్తారు. ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజల వెంట నిలబడతారా? లేదా మోదీ, అమిత్ షాల మాటలు వింటారా? అన్నది తేల్చుకోండి. జగన్ రెడ్డి తిరగడబడతాడనే జనం అనుకుంటున్నారు. రండి జగన్.. పార్లమెంట్ వేదికగా పోరాడండి. 51 శాతం ఓట్లు, 151 సీట్లు ఏ రాష్ట్రంలోనూ రాలేదు. భయపడటం వైఎస్ఆర్ కొడుకు చేయాల్సినది కాదు. విశాఖలో సెమినార్ పెట్టండి... వైజాగ్ డిక్లరేషన్ ఇద్దాం" అని ఉండవల్లి పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు