వైఎస్ కుమారుడు జగన్‌పై నాకెందుకు ప్రేమ వుండదు?: ఉండవల్లి

శనివారం, 2 డిశెంబరు 2017 (16:42 IST)
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై తనకు ప్రేమ వుంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ అంటే తనకు ప్రేమేనని ఉండవల్లి అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని చెప్పారు. అమరావతి నిర్మాణం తాను బతికుండగా జరిగే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. 
 
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం కేంద్రానికి వంగి సలాములు చేస్తున్నారని.. అందుకే ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఉండవల్లి అన్నారు. అలా కాకుండా చంద్రబాబు గట్టిగా నిలబడి బల్లగుద్ది ప్రశ్నిస్తే విషయం తేలిపోతుందని చెప్పుకొచ్చారు. బాబు నిర్మించనున్న అమరావతిని తాను చూడలేనని.. అన్ని సంవత్సరాలు బతకలేనని అన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు ఎందుకు పోరాడడం లేదని ఉండవల్లి నిలదీశారు. చంద్రబాబు బలహీనత ఏదో కేంద్రం వద్ద ఉన్నట్టు అనిపిస్తోందని, అందుకే బాబు పోలవరం పూర్తి చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. విభజన హామీలు నెరవేర్చమని అడగడం ఆంధ్రులుగా మన హక్కు, ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు పోరాడాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి నిధులపై అంత నిర్వేదం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించనప్పుడు మెతకగా ఉండడం వల్ల ఉపయోగం ఏముంటుందని ఉండవల్లి ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు