ఏ క్షణమైనా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు!!!

వరుణ్

శుక్రవారం, 12 జులై 2024 (09:23 IST)
గత వైకాపా ప్రభుత్వ హయాంలో పాలకులు అండ చూసుకుని పలువురు వైకాపా ప్రజాప్రతినిధులు రెచ్చిపోయారు. ముఖ్యంగా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారు వైకాపా పంచన చేరి టీడీపీ నేతలపై నోరు పారేసుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరితో పాటు నారా లోకేశ్ పుట్టుకపై కూడా అసభ్యంగా మాట్లాడారు. అంతేకాకుండా టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయంపై వైకాపా శ్రేణులు దాడి చేసేలా ప్రోత్సహించారు. ఇలా గత ప్రభుత్వంలో జరిగిన దాడులకు సంబంధించి ఇపుడు కేసు నమోదవుతున్నాయి. పాత్ కేసుల్లో చలనం వస్తుండటంతో వైకాపా నేతల్లో వణుకు మొదలైంది.
 
నిజానికి గతంలో టీడీపీ నేతలపై జరిగిన దాడుల కేసుల్లో ఏమాత్రం పురోగతి లేదు. వైకాపా నేతలు ఒత్తిడితో పోలీసులు కేసుల దర్యాప్తును పక్కకు పెట్టేశారు. తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడంతో నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పైనుంచి ఒత్తిడి వల్ల పక్కన పెట్టిన కేసుల దుమ్ముదులుపుతున్నారు. ఈ క్రమంలోనే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి అధికార పార్టీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదైంది. 
 
ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టులో పోలీసుల తరపు న్యాయవాది ఇదే విషయాన్ని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ దాడికి కారణమని విన్నవించారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్ విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ కేసులో కొంతమంది నిందితులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏ క్షణంలోనైనా మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో కనిపించడం లేదు. పైగా, గత నెల రోజులుగా ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు